గుంటూరు జిల్లా, సెప్టెంబర్ 13: గుంటూరు జిల్లా పొన్నూరులో తల్లిని సొంత కుమార్తె ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పొన్నూరులోని క్యాబిన్పేటకు చెందిన ఈవూరు లక్ష్మి (48) హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పుష్పలత భర్త మృతి చెందడంతో తన కుమారుడితో కలిసి తల్లి లక్ష్మి వద్దే నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు రాజా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసినట్లు సమాచారం.
అయితే రాజాతో సంబంధాన్ని కొనసాగించవద్దని తల్లి లక్ష్మి కుమార్తె పుష్పలతకు పలుమార్లు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తల్లిపై ఆగ్రహం పెంచుకున్న పుష్పలత, తన ప్రియుడు రాజాతో కలిసి ఆమెను హత్య చేయాలని పథకం వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పథకం ప్రకారం ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి లక్ష్మిని హత్య చేసినట్లు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

