26.5 C
Hyderabad
Monday, September 14, 2026

బిజెపి నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన

Must read

📰 Generate e-Paper Clip

 

న్యూఢిల్లీ : బిజెపి తన నూతన జాతీయ కార్యవర్గ బృందాన్ని సోమవారం ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో ప్రకటించిన ఈ కొత్త జాబితాలో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 9 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, 16 మంది జాతీయ కార్యదర్శులను నియమించారు. జాతీయ ఉపాధ్యక్షులుగా రామ్ మాధవ్, పురందేశ్వరి సహా 13 మందికి బిజెపి అవకాశం కల్పించింది. బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బిఎల్ సంతోష్‌ను కొనసాగించింది. అలాగే జాతీయ కోశాధికారిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు మరోసారి బాధ్యతలు అప్పగించింది. సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా శివ ప్రకాష్, సౌధాన్ సింగ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా సునీల్ బన్సల్, వినోద్ తావుడే, విప్లవ్ కుమార్ దేవ్, స్మృతి ఇరానీ, సతీష్ పునియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియాలకు చోటు కల్పించింది. పార్టీ సోషల్ మీడియా కన్వీనర్‌గా దీపక్‌ను, మీడియా కన్వీనర్‌గా అనిల్ బలోనిని నియమించింది. బిజెపి యువ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ హేమంగు జోషికి బాధ్యతలు అప్పగించింది. మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రూప్ కుమారి చౌదరిని నియమించింది. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అమరుపాల్ మౌర్య, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బన్సీలాల్ గుజర్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా శివేష్ కుమార్ రామ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా మన్నన్లాల్ రావత్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా కొన్వార్ బాసిత్ అలీలను నియమిస్తూ బిజెపి అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. నూతన జాతీయ టీం లో అనుభవజ్ఞులతోపాటు యువ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేలా కూర్పు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, బిజెపి నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కలేదు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.