*నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు*
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డిని హత్య చేసింది ఆమె చదువు చెప్పిన విద్యార్థులేనని నిర్ధారించిన పోలీసులు
రూపా రెడ్డి హత్య కేసులో ఐదు బృందాలు ఏర్పాటు చేసి దాదాపు 70 సీసీ కెమెరాలు పరిశీలించాము
రూపా రెడ్డి చివరిసారిగా ఆమె పిన్నితో మాట్లాడుతూ “బాబు” అని అన్నట్టు తెలుసుకుని, స్కూల్ పిల్లలను కూడా అలానే పిలుస్తుందని నిర్ధారించి అక్కడ విచారణ మొదలుపెట్టాము
రూపా రెడ్డి హత్య తర్వాత నాలుగు రోజులు స్కూల్కు సెలవులు ఇవ్వగా, రీ ఓపెన్ అనంతరం స్కూల్కు గైర్హాజరైన 13 మంది విద్యార్థులను విచారించాము
వారిలో ఐదుగురు పదో తరగతి విద్యార్థులు ఉండగా, అందులో ఇద్దరు డబ్బులు ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించాము
నిందితుల్లో ఒకరి దగ్గర రూ.1.54 లక్షల నగదు గుర్తించి, అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించగా, తల్లిదండ్రులు ఇచ్చారని నిందితుడు తెలిపాడు
నిందితుడి వద్ద దొరికిన నోట్లపై రక్తపు మరకలు చూసి ల్యాబ్కు పంపించగా, అది రూపా రెడ్డి రక్తమని నిర్ధారణ అయింది
నిందితుల్లో ఒకరు గతంలో హాస్టల్లో ఉండేవాడని, అతనికి మద్యం అలవాటు, బైకులంటే మోజు ఉండేదని, అతని బ్యాగులో నగదు, ఫోన్ చూసి మందలించి రూపా రెడ్డి అతన్ని హాస్టల్ నుంచి డే స్కాలర్గా మార్చినట్టు, అప్పటి నుంచి అతను రూపా రెడ్డిపై కోపం పెంచుకున్నట్టు తెలిసింది
నెల రోజుల క్రితమే ఒక నిందితుడు గోవాకు వెళ్లాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఆశతో, ఐదు రోజుల క్రితమే రూపా రెడ్డి ఇంట్లో దొంగతనం చేసేందుకు రెక్కీ నిర్వహించాడు
రూపారెడ్డి ఇంట్లో స్కూల్ ఫీజు డబ్బులు ఉంటాయని తెలుసుకుని, ఈ నెల 11వ తేదీన స్కూల్ నుంచి వచ్చాక, ఇద్దరు నిందితులు కలిసి ప్రిన్సిపల్ ఇంటికి మాస్కులు వేసుకుని గోడ దూకి వెళ్లారు
అందులో ఒకరి మాస్క్ పడిపోవడంతో అతన్ని రూపా రెడ్డి గుర్తించింది
దీంతో ఆమెను 27 సార్లు కత్తితో పొడిచి, కిందపడిపోయిన ఆమె ఫోన్ తీసుకుని, నగదు తీసుకుని పారిపోయారు
నిందితుల నుంచి రూ.1.54 లక్షల నగదు, ఐఫోన్, రూపా రెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకున్నాము
నిందితులు మైనర్లు కాబట్టి జువెనైల్ జస్టిస్ కోర్టుకు పంపిస్తాము
– నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

