కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త హత్య చేసిన విషాద ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది. ప్రకాశం రోడ్డులో నివాసముంటున్న అన్నం నరేష్, లక్ష్మి దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి.
బుధవారం ఉదయం మరోసారి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ తారస్థాయికి చేరడంతో నరేష్ క్షణికావేశంలో భార్య లక్ష్మి మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు సమాచారం.
స్థానికుల సమాచారంతో కోరుట్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతురాలు లక్ష్మి, నరేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.