మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్లో విషాద ఘటన
మేడ్చల్–మల్కాజిగిరి: వినాయక విగ్రహం కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసి ఓ యువకుడి మృతికి కారణమైన విషాద ఘటన పోచారం ఐటీ కారిడార్ పరిధిలో చోటుచేసుకుంది.
జోడిమెట్ల సమీపంలో వినాయక విగ్రహం కొనుగోలు, ధర విషయంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణ జరిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో చౌదరిగూడకు చెందిన **కిరణ్ (34)**పై దాడి జరిగినట్లు తెలుస్తోంది.
తీవ్రంగా గాయపడిన కిరణ్ను చికిత్స నిమిత్తం సూర్య ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కిరణ్ మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘర్షణలో విగ్రహాల విక్రేత చోగారామ్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. కిరణ్ మృతితో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర ఆందోళనకు దిగారు.
జోడిమెట్ల సమీపంలోని వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై నిరసన చేపట్టి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.