ప్రపంచాన్ని ఎల్నినో ముప్పు మరింత తీవ్రంగా వెంటాడనుంది. పసిఫిక్ సముద్రంలో అసాధారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఎల్నినో రానున్న నెలల్లో ‘అత్యంత బలమైన’ స్థాయికి చేరే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది.
WMO తాజా అంచనాల ప్రకారం ఎల్నినో 2026 చివరి నాటికి గరిష్ఠ తీవ్రతకు చేరుకోవచ్చని, 2027 ఫిబ్రవరి వరకు కొనసాగేందుకు దాదాపు 100 శాతం అవకాశం ఉంది. దీని ప్రభావంతో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతల నమూనాల్లో భారీ మార్పులు చోటుచేసుకుని వరదలు, కరువులు, తీవ్ర వేడిమి వంటి విపరీత వాతావరణ పరిస్థితులు పెరిగే ప్రమాదం ఉంది.
‘ప్రమాదకర వాతావరణ జోన్లోకి ప్రపంచం’
“మన కళ్ల ముందే ఎల్నినో భారీ స్థాయికి పెరుగుతోంది” అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రపంచం తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రమాదకర దశలోకి వెళ్తోందని పేర్కొన్నారు.
WMO సెక్రటరీ జనరల్ సెలెస్టె సౌలో మాట్లాడుతూ.. ఇప్పటికే అనేక ప్రాంతాలు వరదలు, కరువులతో తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని, ఎల్నినో బలపడే కొద్దీ ఈ ప్రభావాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అసాధారణ స్థాయిలో ముందస్తు సన్నద్ధత, విపత్తు నిర్వహణ చర్యలు అవసరమని స్పష్టం చేశారు.
వ్యవసాయం, నీటి వనరులు, ఆరోగ్యం, విద్యుత్ తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని WMO సూచించింది.