*మిస్ ఇండియా యూనివర్స్ లో సత్తాచాటిన తెలంగాణ యువతులు…ఇద్దరు రన్నరప్లు…!*
తెలంగాణకు చెందిన యువతులు.. ఐర్లాండ్ వేదికగా జరిగిన *‘మిస్ ఇండియా యూనివర్స్ 2026* ’ అందాల పోటీల్లో ప్రతిభ చాటారు. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మాదినేని నిఖిత.. ఈ పోటీల్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచి తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. విదేశీ గడ్డపై జరిగిన ప్రతిష్ఠాత్మక పోటీలో తన ఆత్మవిశ్వాసం, ప్రతిభతో ఆకట్టుకున్న మాదినేని నిఖితకు ఈ ఘనత దక్కింది. ఆమె విజయంతో వైరా పట్టణ ప్రజలు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే పోటీల్లో వరంగల్కు చెందిన రాజరాజేశ్వరి అనే యువతి.. మూడో స్థానంలో నిలవడం మరో విశేషం.
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో ఈనెల 8వ తేదీన ఈ అందాల పోటీలను నిర్వహించారు. ఐర్లాండ్లో నివసిస్తున్న భారతీయ యువతుల కోసం ‘నమ్ముడి ఐర్లాండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్’ ఆధ్వర్యంలో ఈ అందాల పోటీలు జరిగాయి. ఈ సంస్థలో కేరళకు చెందిన మలయాళీ సభ్యులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ.. పోటీల్లో మాత్రం తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు చెందిన యువతులు పాల్గొన్నారు. అర్హతల ఆధారంగా మొత్తం 18 మంది యువతులను ఫైనల్ పోటీలకు ఎంపిక చేశారు.
3 రౌండ్లుగా సాగిన పోటీలో కేవలం అందానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా.. ఈ పోటీలో పాల్గొన్న అభ్యర్థుల వ్యక్తిత్వం, ధైర్యం, సమయస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం వంటి అంశాలకు కూడా పరిగణలోకి తీసుకున్నారు. స్టేజ్ పెర్ఫార్మెన్స్తో పాటు అభ్యర్థులను జడ్జిలు పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. మరీ ముఖ్యంగా అపజయాలను ఎలా ఎదుర్కొంటారు.. విజయాన్ని సాధించేందుకు ఎలాంటి దృక్పథంతో ముందుకు సాగుతారు.. వంటి ప్రశ్నలతో పోటీదారుల ఆలోచనా విధానాన్ని పరీక్షించారు.
ఈ పోటీలో కేరళకు చెందిన అనుమోల్ అగ్రస్థాన్ని దక్కించుకుని విజేతగా నిలిచారు. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మాదినేని నిఖిత ఫస్ట్ రన్నరప్గా ఉండగా.. వరంగల్కు చెందిన రాజరాజేశ్వరి మూడో రన్నరప్గా నిలిచారు. విజేతకు 1,500 యూరోలు.. ఫస్ట్ రన్నరప్కు 1,000 యూరోలు.. సెకండ్ రన్నరప్కు 750 యూరోల ప్రైజ్మనీ అందించారు.