DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 4:23 pm Posted by : DESHA TIME

ఉచిత విద్యుత్ బ్రాండ్ కాంగ్రెస్‌దే: మంత్రి పొంగులేటి

*ఉచిత విద్యుత్ బ్రాండ్ కాంగ్రెస్‌దే : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*

 

– *వరి వద్దన్నా వేసిన రైతులకు అండగా ఉంటాం*

 

– *చెరువుమాదారం ‘మోడల్ సోలార్ విలేజ్‌’గా గుర్తింపు*

 

ఖమ్మం ప్రతినిధి ఆగష్టు 19(దేశ టైమ్స్ )

 

వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా వరి వద్దని చెప్పినా పంట వేసిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నీటి ఎద్దడి వల్ల ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తుందని, అయితే ఇప్పటివరకు సాగు ప్రారంభించని రైతులు మాత్రం ఆరుతడి లేదా ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచించారు. బుధవారం నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

 

– *ఇంటింటికీ సోలార్ విద్యుత్ వెలుగులు*

చెరువుమాదారంలో నిర్వహించిన పునరుత్పాదక ఇంధన అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ఉచిత విద్యుత్ భావనకు మూలరూపం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఉద్ఘాటించారు. చెరువుమాదారాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రూ. 100 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఇంటికీ రూ. 1.40 లక్షల వ్యయంతో సోలార్ అమర్చామని, ఉచిత విద్యుత్ వినియోగం పోను మిగిలిన కరెంటును ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. భవిష్యత్తులో గృహజ్యోతి లబ్ధిదారులతో పాటు వ్యవసాయ మోటార్లకు కూడా సోలార్ ప్లాంట్లు ఇస్తామని తెలిపారు.

 

* *అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. కాంగ్రెస్‌లోకి చేరికలు*

*

బుద్ధారంలో రూ. 1.97 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు , కొంగరలో రూ. 1.05 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో కొంగర గ్రామానికి చెందిన స్వతంత్ర సర్పంచ్ మల్లెంపూడి కృష్ణకుమారి వార్డు సభ్యులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం నేలకొండపల్లి, బోదులబండ, చెన్నారం, ఆచార్యులగూడెం గ్రామాల్లో పర్యటించి పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.